కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు: మహేశ్ కుమార్ గౌడ్

  • కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకున్నారని ఆరోపణ
  • ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని విమర్శ
  • విద్యార్థుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందన్న మహేశ్ కుమార్ గౌడ్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు దీక్షా దీవస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని ఆయన విమర్శించారు.

మూడు రోజులకే దీక్షను ముగించి కేసీఆర్ పలాయనం చిత్తగించారని, దీంతో విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థుల నిరసనల కారణంగానే కేసీఆర్ తన దీక్షను కొనసాగించారని ఆయన వివరించారు. కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదని, విద్యార్థుల ఆందోళనలు, కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పేదలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీలు ఎంతోమంది ఆత్మార్పణం చేసుకున్నారని ఆయన అన్నారు. వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ వస్తే, కేసీఆర్ కుటుంబం మాత్రం పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Mahesh Kumar Goud
KCR
Telangana sentiment
BRS
Telangana PCC
Deeksha Deevas

More Telugu News